సంక్లిష్ట గుండె సమస్యలకు నూతన పరిష్కారం కనుగొన్న కె.ఎల్.యు పరిశోధనా విద్యార్థిని శ్రేయ
గుంటూరు, జూలై 19: కె.ఎల్ డీమ్డ్ యూనివర్శిటీలోని ఫార్మసీ కళాశాలలో పరిశోధన విద్యార్థిని శ్రేయ కొసనం గుండె సంబంధిత సమస్యలకు మొక్కల ఆధారిత చికిత్సలతో నూతన పరిష్కారాలను కనుగొన్నట్లు కెఎల్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రవర్తి శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ రాజేశ్వరి పసుపుల మార్గదర్శకత్వంలో గుండె సంబంధిత వ్యాధులపై పరిశోధన చేసిన శ్రేయ కొసనం గుండెకు ఏర్పడే పలు రకాల సమస్యలకు సాంప్రదాయ మొక్కల నుండి పలు రకాల ఔషధాలు తయారు చేయవచ్చుననే పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. అందుకు గాను శ్రేయ కొసనం కెఎల్ ఫార్మసీ కళాశాల నుండి పిహెచ్డి డిగ్రీని అందుకున్నట్లు తెలిపారు. ఆమె చేసిన పరిశోధనను మెడికల్ పరిభాషలో 'ఇన్వెస్టిగేషన్స్ ఆన్ మిథైల్ గ్లైకోసైడ్ అండ్ సిన్నమోయిల్ డెరివేటివ్ ఫ్రమ్ అగనోస్మా డైకోటోమా ఎగైనెస్ట్ మయోకార్డియల్ ఇస్కీమియా - రిపెర్ఫ్యూజన్ ఇంజురీ, ఇంటిగ్రేటింగ్ కంప్యూటేషనల్ టెక్నిక్స్ విత్ సెల్ లైన్ వాలిడేషన్ యూజింగ్ హెచ్9సి2 కార్డియో మయోసైట్స్' అని పేర్కొంటారన్నారు. తన థీసిస్కు గాను కె.ఎల్.యు ఫార్మసీ కళాశాల వారు శ్రేయ కొసనంకు పిహెచ్డి ప్రదానం చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ ఔషధ మొక్కల నుండి నెట్వర్క్ ఫార్మకాలజీ ద్వారా బహుళ-లక్ష్య చికిత్సా వ్యూహాలను అభివృద్ధి చేయడంపై ఆమె పరిశోధన దృష్టి సారించినట్లు తెలిపారు. హెచ్9సి2 సెల్ నమూనాలలో ప్రయోగాత్మక ధ్రువీకరణతో గణన అంచనాను కలపడం ద్వారా, ఆమె పని అనువాద, బహుళ విభాగ విధానాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సమగ్ర అధ్యయనం సాంప్రదాయ వైద్యం, ఆధునిక ఔషధ శాస్త్రాన్ని వారధిగా చేసుకుని, సంక్లిష్ట గుండె పరిస్థితులను లక్ష్యంగా చేసుకుని మొక్కల ఆధారిత చికిత్సలకు నూతన దిశలను అందిస్తుందన్నారు. ఈ సందర్బంగా ఆమెను కెఎల్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రవర్తి, డైరెక్టర్ డాక్టర్ బుచ్చి నాయుడు, ఆర్ ప్యాక్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర అభినందించారు.గుంటూరుకు చెందిన మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ మాజీ విప్ లింగంశెట్టి ఈశ్వరరావు మనమరాలు చి.శ్రేయ... పారిశ్రామికవేత్త కొసనం రామారావు - శ్రీమతి భారతి దంపతుల కుమార్తె కావడం విశేషం.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0