*అమరావతి, మహి న్యూస్ మార్చి 19:* రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం/ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశముందని మంత్రి తెలిపారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
*రైతులకు సూచనలు*
🔸పండిన పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలి
🔸వడగళ్ల వాన, ఈదురుగాలుల సమయంలో పొలాల్లో ఉండకూడదు
🔸వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి
🔸పండ్ల తోటలకు రక్షణ చర్యలు తీసుకోవాలి
🔸పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడకూడదు, సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలి
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అకాల వర్షాలతో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, పంటలు, ఆస్తులకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
*జారీ చేసిన వారు: పిఆర్వో - వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రివర్యుల కార్యాలయం*









Be the first to comment.