యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 15: స్థానిక మెట్టకూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించిన ఘటన యానాంలో వివాదాస్పదంగా మారింది. ఈ విద్యాలయంలో చదివిన ఇద్దరు పూర్వ విద్యార్థులు అనుమతులు లేకుండా విద్యాలయ ఆవరణలో ప్రీ వెడ్డింగ్ వీడియో షూటింగ్ నిర్వహించడం చర్చనీయమైంది. వివరాల ప్రకారం, పూర్వ విద్యార్థులైన ఈ ఇద్దరు వ్యక్తులు తరగతి గదులు, ప్రిన్సిపాల్ గది, కళాశాల ప్రాంగణం తదితర ప్రదేశాల్లో వీడియో చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో షూటింగ్ నిర్వహించినట్లు తెలిసింది. దీంతో విద్యాలయ నియమ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుంకర కార్తిక్ యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనాకు ఫిర్యాదు చేశారు. విద్యాసంస్థల గౌరవం దెబ్బతినే విధంగా ఇలాంటి చర్యలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, షూటింగ్‌లో పాల్గొన్న ఇద్దరు పూర్వ విద్యార్థుల్లో ఒకరు పుదుచ్చేరిలో అసిస్టెంట్‌గా, మరొకరు తిరుపతిలోని నవోదయ విద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. విద్యావేత్తలుగా ఉన్న వారు ఈ విధంగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన విద్యాలయ ప్రిన్సిపాల్ కీర్తి, ఆ ఇద్దరు పూర్వ విద్యార్థులు ముందుగా వచ్చి తమ వివాహ శుభలేఖ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫోటోలు మాత్రమే తీసుకోవాలని చెప్పారని, కానీ వారు విస్తృతంగా వీడియో షూటింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామని యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీడియాకు తెలిపారు. సంబంధిత ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, అవసరమైతే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన విద్యాసంస్థల్లో నియమాల అమలు, పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.