మంగళగిరి, మహి న్యూస్, మార్చి 31: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ తండ్రికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఏ.అరవింద్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఆర్.చంద్రంపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలని డి.తేజ కోరారు. అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో ఉన్న మసీదు శిథిలావస్థకు చేరుకుందని, నూతన మసీదు నిర్మాణానికి సాయం అందించాలని జామియా మసీదు కమిటీ సభ్యులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వారసత్వంగా సంక్రమించిన తమ 0.36 ఎకరాల వ్యవసాయ భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయాలని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం, కె.బిట్రగుంటకు చెందిన మన్నేపల్లి రజని విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
బోయ మంజునాథ్ కు మంత్రి లోకేష్ అభినందనలు
అంతకుముందు సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు హిందూపూర్ నుంచి ప్రజారాజధాని అమరావతి వరకు 713 కి.మీల మేర సైకిల్ యాత్ర చేపట్టిన బోయ మంజునాథ్ ను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.








Be the first to comment.