తాళ్లరేవు, మహి న్యూస్,మార్చి 25:శెట్టిబలిజ జాతిపిత, సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు దొమ్మేటి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ వెంకటరెడ్డి  చేసిన సామాజిక సేవలకు గుర్తుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు, శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని, విద్య యొక్క ప్రాముఖ్యతను ఆరోజుల్లోనే చాటి చెప్పారన్నారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, తన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చిన ధైర్యశాలి  దొమ్మేటి వెంకటరెడ్డి అని కీర్తించారు.  జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. దొమ్మేటి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా  ప్రకటించిన చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు..